నేడు వైఎస్సార్ వర్ధంతి సభ.. ఆహ్వానం అందినా వెళ్లకూడదని వైసీపీ నేతల నిర్ణయం?

  • నేడు వైఎస్ 12వ వర్ధంతి
  • రావాలంటూ ఏపీ, తెలంగాణ నేతలకు విజయమ్మ ఆహ్వానం
  • పార్టీ నిర్ణయం మేరకు వైసీపీ నేతలు దూరం
  • హాజరుకానున్న ఉండవల్లి, కేవీపీ
వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సభకు హాజరు కాకూడదని వైసీపీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వైఎస్సార్‌తో గతంలో పనిచేసిన, సన్నిహితంగా మెలిగిన నేతలను విజయమ్మ ఆహ్వానించారు.

వీరిలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన  కరుణాకర్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అయితే, ఆహ్వానాలు అందినప్పటికీ పార్టీ నిర్ణయం మేరకు వర్ధంతి సభకు వెళ్లకూడదని వైసీపీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వంటి పార్టీల్లో ఉన్న దాదాపు 350 మంది తెలంగాణ నేతలను కూడా ఈ సభకు ఆహ్వానించారు.

ఆహ్వానం అందుకున్న టీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో వారు రాలేకపోవచ్చని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, కేవీపీ రామచంద్రరావు వంటి వారు సభకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ సభను వైఎస్ కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమన్వయం చేసే అవకాశం ఉంది.

YS Rajasekhara Reddy
YS Vijayamma
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News